కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. మరో రెండు మూడు నెలల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దృష్టి సారించింది.
దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన నెట్వర్క్ కు రూపకల్పన జరుగుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తపాలాశాఖ మాస్ వ్యాక్సినేషన్ కోసం రూట్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ వ్యాక్సిన్ తరలించేందుకు పోస్టల్ నెట్వర్క్ను వినియోగించనున్నారు.
ఇంతేకాదు వ్యాక్సిన్ ట్రాన్స్ పోర్టేషన్ మొదలుకొని కోల్డ్ చెైన్ ఏర్పాటు వరకూ తపాలాశాఖ బాధ్యత వహించనుంది. వ్యాక్సిన్ వచ్చాక దానిని తగినంత ఉష్ణోగ్రతలో ఉంచి, ఇతర ప్రాంతాలకు తరలించాల్సివుంటుంది. వ్యాక్సిన్ రాగానే ప్రజలకు వీలైనంత త్వరగా చేరువ చేసేందుకు పోస్టల్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పోస్టల్శాఖ వద్ద ఉన్న వేలాది వాహనాలను వినియోగించనున్నారు. కాగా గతంలో తపాలా విభాగం టీబీ వ్యాక్సిన్ను తగినంత ఉష్ణోగ్రతలో ఉంచి వివిధ ప్రాంతాలకు తరలించే పనిని చేపట్టింది. ఈ నేపధ్యంలోనే కరోనా వ్యాక్సిన్ తరలింపు ప్రక్రియను ప్రభుత్వం తపాలా శాఖకు అప్పగించనుంది.