భారత్ చైనాల మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఓ వైపు అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా మాత్రం తన వక్రబుద్దిని ప్రదర్శిస్తూనే ఉంది. రక్షణ మంత్రుల సమావేశంలో చైనా తీరును ఎండగట్టిన రాజ్నాథ్ ఇప్పటికైనా బలగాలను వెనక్కుతీసుకోవాలని హితవు పలికారు.
అయినప్పటికీ చైనా మాత్రం నిప్పును రాజేస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సుబన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా అపహరించినట్లు తెలుస్తోంది. వేట కోసమని అడవిలోకి వెళ్లిన వీళ్లని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వీరిని తీసుకెళ్లినట్లు సమాచారం. అడవిలోకి మొత్తం ఏడుగురు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు తప్పించుకొని ఊళ్లోకి వెళ్లారు. మిగతా ఐదుగురు భారతీయులను చైనా తీసుకెళ్లింది.
చైనా అపహరించిన వారిలో తోచ్ సింగ్ కం, ప్రసాద్ రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తనూ బకర్, నారు దిరి ఉన్నట్లు తెలుస్తోంది. చైనా ఆర్మీ నుంచి తప్పించుకున్న ఇద్దరు ఈ సమాచారం అందించారు. చైనా అపహరించిన ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ వాళ్లు కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ఉన్నారు.