తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఓ వెలుగు వెలిగిన నేత కన్నా లక్ష్మీనారాయణ. జాతీయ పార్టీ పైగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీకి ఈయన ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అధ్యక్ష్య పదవి నుంచి ఆయన్ను తప్పించడంతో ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
కన్నా లక్ష్మీనారాయణను కుర్చీలోంచి దించి సోము వీర్రాజుకు అధ్యక్ష్య పదవి ఇవ్వడంతో కన్నా అలిగినట్టున్నారు. అందుకే రాష్ట్రంలో ఆయన అడ్రస్ కనిపించకుండా పోయింది. లేదంటే అధ్యక్ష్య పదవిలో ఉన్నప్పుడు ఆయన స్వరం గట్టిగా ఉండేది. అధికార వైసీపీపై ఆయన ఉవ్వెత్తున లేచేవారు. మూడు రాజధానుల అంశంపై ఆయన అమరావతికి మద్దతుగా మాట్లాడారు.
ఓ క్రమంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కన్నా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా రాష్ట్రంలో జరిగింది. అయితే ఉన్నట్టుండి బీజేపీ అధిష్టానం కన్నాను మార్చాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయన కనిపించడం లేదు. మామూలుగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడితే వైసీపీకి ఆపోజిట్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కూడా బీజేపిని డ్యామేజ్ చేసేట్లు ప్రవరిస్తున్నారని కొత్త అధ్యక్షుడు అనుకునే చాన్స్ ఉంది. పైగా ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న కారణంతో పలువురిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ తరుణంలో రాజకీయాల గురించి మాట్లాడటం ఎందుకని కన్నా సైలెంట్ అయ్యారేమో అని పొలిటికల్ డిస్కషన్.
పైగా కన్నా టిడిపికి అనుకూలంగా వ్యహరించారన్న చెడ్డ పేరు ఉంది. ఇప్పుడు సోము కూడా వైసీపికి కాస్త అనుకూలమే అన్న సంకేతాలు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి మంచి సత్సంబంధాలే కనిపిస్తున్నాయి. శత్రువుల వాతావరణం లేనందున ఇద్దరికి సెట్ అయ్యిందని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోము ఏం మాట్లాడినా వైసీపీకి అనుకూలమనే ప్రచారం జరగడం కామన్. మరి ఈయన కూడా బీజేపీ స్టాండ్లోనే మాట్లాడతారో లేదా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారన్న బ్యాడ్ నేమ్ మూటగట్టుకుంటారో వేచి చూడాలి.