సెలబ్రెటీ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దళిత యువకుడికి శిరోముండనం కేసులో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్గా తీసుకుంది. పోలీసులు నూతన్ నాయుడును న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
సెల్ ఫోన్ దొంగతనం అంటూ తమ ఇంట్లో పనిచేసి మానేసిన ఓ దళిత యువకుడికి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు శిరోముండనం చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఇది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముందు దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయన్న ఆందోళనలు చెలరేగుతున్న పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
దీంతో పోలీసులు నూతన్ నాయుడు, ఆయన భార్యతో పాటు ఘటనలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. నూతన్ నాయుడును కర్నాటకలోని ఉడిపిలో అరెస్టు చేసిన పోలీసులు రాత్రి కే.జీ.హెచ్ తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా రిమాండ్ విధించడంతో అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు. అయితే నూతన్ నాయుడుపై ఈ కేసు మాత్రమే కాకుండా గతంలో రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి పి.వి రమేష్ పేరుతో ఫేక్ కాల్స్ చేశాడని కేసు నమోదైంది.