ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ముందడుగు కనిపించబోతోంది. రాయలసీమ ముఖద్వారంలో మొట్టమొదటి పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వై.ఎస్ జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్టు ఉన్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసే యోచనలో ఉంది.
కర్నూలు ఎయిర్పోర్టు అప్పట్లోనే ప్రారంభిస్తారని అనుకున్నా పలు కారణాల వల్ల ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు దీనిపై శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయదశమి నాటికి ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. దేశంలోని ప్రముఖ నగరాలకు అందుబాటులో ఉండేలా కర్నూలు ఎయిర్పోర్టును తీర్చిదిద్దనున్నారు. ఏపీలో తొలి పైలట్ శిక్షణా కేంద్రం కర్నూల్లోనే ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కర్నూలు నుంచి విజయవాడ, విశాఖ, బెంగళూరుకు విమానాలు నడిపేందుకు ట్రూజెట్ సంస్థ ముందుకొచ్చింది. చౌకధరలతోనే విమానాలు నడువనున్నాయి. దీంతో ఈ అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొని పైలట్ శిక్షణను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాయలసీమ ముఖద్వారంలో త్వరలోనే విమానాలు ఎగురనున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని అనుకున్నా అది నెరవేరలేదు. దీంతో జగన్ వచ్చాక విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చాయని అంతా అనుకుంటున్నారు.