బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఏకకాలంలో మూడు రాష్ట్రాలలో సీబీఐ దాడులు చేసింది. అయితే ఇప్పుడు అందరి దృష్టీ రఘురామ ఏం చెబుతారో అన్న దానిపైనే ఉంది.
జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని.. కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఆ నిధుల్ని అక్రమంగా తన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో ఈయనపై సీబీఐ దాడులు చేసింది. ఈయనకు సంబంధించిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం సోదాలు చేశాయి. ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రాంతాల్లో ఆయన, ఆయన కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆస్తులపై 11 బృందాలుగా అధికారులు విడిపోయి సోదాలు నిర్వహించారు.
రఘురామకృష్ణంరాజు ఇండ్ భారత్ ధర్మల్ పవర్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు దాని అనుబంధ బ్యాంకుల నుంచి రూ. 826.17 రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని పక్కకు మళ్లించినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. రఘురామతో పాటు ఆయన భార్య, కూతురుపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులకు సంబందించి ఈయన ముందునుంచీ తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.
తనకు అప్పులు ఉన్న మాట వాస్తవమే కానీ అవి కట్టేందుకు వన్ టైం సెటిల్ మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లోనే చెప్పారు. అయితే కొన్నాళ్లు సీబీఐ సైలెంట్గా ఉన్నా మళ్లీ ఇప్పుడు కేసులో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా సీబీఐ విచారణ జరుగుతుందన్న వార్తలను గురువారం రఘురామ కొట్టిపారేశారు. అయితే ఆయనకు చెంపపెట్టులా సాయంత్రానికి సీబీఐకే ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. మరి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఏం చెప్తారో అన్నది ఆసక్తిగా ఉంది. ఎప్పటిలాగే అప్పులు కడతామని చెబుతారో లేదా ఏదైనా కొత్త విషయం బయటపెడతారో వేచి చూడాలి.