యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాపై యావత్ భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్కు జోడిగా దీపిక పదుకొణె నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కూడా నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్ను ఇచ్చారు చిత్ర యూనిట్.
‘ఈ లెజెండరీ సినిమాను లెజెండ్ లేకుండా ఎలా నిర్మించగలం‘.. అంటూ భారీ ప్రకటన చేశారు. ఈ భారీ చిత్రంలో ఇండియన్ లెజెండరీ నటులు బిగ్బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ పాత్ర కీలకంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ విషయమై నాగ్ అశ్విన్ స్పందిస్తూ..‘బచ్చన్ సర్ మా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఈ చిత్రంలో ఆయనది పూర్తి నిడివి గల పాత్ర. లెజెండ్ అమితాబ్ ఈ పాత్రకు న్యాయం చేస్తాడని మేము నమ్ముతున్నాము’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్న ఈ సినిమాను 2021లో విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.