రిలీజ్ అయిన వెంట‌నే మళ్లీ అరెస్ట‌యిన నూత‌న్ నాయుడు భార్య‌..

సెల‌బ్రెటీ నూత‌న్ నాయుడు భార్య మ‌ధుప్రియ‌కు షాక్ త‌గిలింది. బెయిల్‌పై విడుద‌లైన ఆమెను కొద్ది గంట‌ల్లోనే మ‌ళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి అందిన ఫిర్యాదు మేర‌కు మ‌రోసారి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

నూత‌న్ నాయుడు, ఆయన భార్య మ‌ధుప్రియ ఇటీవ‌ల వార్త‌ల్లోకి ఎక్కిన విష‌యం తెలిసిందే. విశాఖలోని సుజాతనగర్‌లో ఉన్న నూతన్‌కుమార్‌నాయుడు ఇంట్లో ఆగస్టు 28న ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గానే వ్య‌వ‌హ‌రించింది. అప్ప‌ట్లో నూతన్‌ ఇంట్లో గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్య‌క్తి పని చేసి మానేశారు. అయితే ఆ ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ శ్రీకాంత్‌ను భద్రతా సిబ్బంది, నూతన్ నాయుడు భార్య మధుప్రియ దుర్భాషలాడారు.

అంతటితో ఆగకుండా శిరోముండనం చేశారు. దీంతో శిరోముండనం ఘటనపై శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మధుప్రియ, నూతన్ నాయుడితో పాటు మరికొంతమందిని రిమాండ్‌కు తరలించిన విష‌యం తెలిసిందే. కాగా బెయిల్‌పై మ‌ధుప్రియ విడుద‌ల అయ్యారు. అయితే తూర్పుగోదావ‌రి జిల్లా వాసి నుంచి మధుప్రియ రూ.25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు వ‌చ్చింది. దీంతో ఈ కంప్లైంట్‌తో మ‌ధు ప్రియ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో విడుద‌లైన కొద్ది గంటల్లోనే ఆమెకు మళ్లీ ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here