మోదీ పాలన భేషుగ్గా ఉందని ఆ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా చెప్పుకుంటుంటే ఆయన బర్త్డే రోజు గట్టి షాక్ తగిలింది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి వర్గం నుంచి అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ బయటకు వచ్చేశారు. దీంతో మోదీ పాలన ఈ విధంగా ఉందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతుల ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లులు తీసుకొచ్చింది. ఈ బిల్లులను ప్రతిక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిల్లులపై మోదీ సర్కార్ వెనక్కు తగ్గకపోవడంతో అకాలీదళ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆకాలీదళ్కి లోక్సభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరిద్దరూ భార్య భర్తలు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఈమె కేంద్ర మంత్రిగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల దేశంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని వీరు పేర్కొంటున్నారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ మోదీ సర్కార్ బిల్లు ఆమోదించుకుంది. ఇన్నాళ్లూ ఎన్.డి.ఏ సర్కారులో భాగమైన అకాలీదళ్ కేంద్ర మంత్రి వర్గం నుంచి బయటకు రావడంతోనే ఆగుతుందా.. లేదా ఎన్.డి.ఏ నుంచే తప్పుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏదిఏమైనా భారీ మెజార్టీతో గెలిచిన మోదీ ఇలా మిత్రపక్షాల నుంచే వ్యతిరేకత తెచ్చుకోవడం ఆందోళన కలిగించే విషయమే.