ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చలో అమలాపురం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున సోము వీర్రాజును పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల ఏపీలో దేవాలయాలపై దాడులు వివాదాస్పదంగా మారుతున్నాయి. అంతర్వేదిలో రథం దగ్దం అవ్వడం, విజయవాడ దుర్గ గుడిలో సింహాలు కనిపించకపోవడం ఘటనలు వివాదం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ చలో అమలాపురం పిలుపు నిచ్చింది. దీంతో అమలాపురానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సోము వీర్రాజును పోలీసులు నిర్బంధించారు. మరో నేత కన్నా లక్ష్మీనారాయణను కూడా పోలీసులు నిర్బంధించారు.
కన్నా అమలాపురం బయలుదేరుతుండగా ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజును కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోనసీమలో సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.