పార్లమెంటును కుదిపేస్తున్న తాజా అంశాల్లో ప్రధానమైనది వ్యవసాయ బిల్లుల అంశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రాష్ట్రాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. పైగా ఎన్.డి.ఏ మిత్రపక్షం కూడా పలుచోట్ల దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో నేడు వ్యవసాయ బిల్లులు రాజ్యసభలోకి వస్తుండటంతో ఏం జరుగనుందో అన్న ఉత్కంఠత నెలకొంది.
మెజార్టీ ఉన్న లోక్ సభలో వ్యవసాయ బిల్లులు ఈజీగా పాసయ్యాయి. అయితే నేడు ఈ బిల్లులు రాజ్యసభలోకి వస్తుండటంతో ఇక్కడ ఓటింగ్ జరుగనుంది. దీంతో అధికార బీజేపీకి కాస్త గడ్డు పరిస్థితి నెలకొన్నట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే లోక్సభలో ఉన్న మెజార్టీ రాజ్యసభలో బీజేపీకి అస్సలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులపై ఎలాంటి రగడ జరుగుతుందో అన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో ఉంది.
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 అయితే బీజేపికి సొంతంగా 86 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి 40 మంది సబ్యులు ఉన్నారు. మిగతా సభ్యులంతా ఇతర ప్రాంతీయ పార్టీల వారు ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ ధీమాగానే కనిపిస్తోంది. తమకు మిత్ర పక్షాలతో కలిపి 130 మంది సభ్యుల మంది మద్దతు ఉంటుందని భావిస్తోంది. మొన్న ఇదే వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్బంగానే ఎన్.డి.ఏ భాగస్వామ్యమైన అకాలీదళ్ ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఉండనుంది. దీని కోసమే కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారు.
బిల్లు ఎప్పుడెప్పుడు రాజ్యసభకు వస్తుందా అడ్డుకుందామా అని కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తోంది. బిల్లును అడ్డుకుంటామని రాహుల్ గాంధీ ఇదివరకే ప్రకటించారు. ఆయన అన్ని ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బిల్లు తేనె పూసిన కత్తిలాంటిదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. బిల్లును అడ్డుకోవాలని చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ బిల్లులపై తీవ్ర మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.