ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనదైన శైలిలో వ్యంగంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. మోదీ ప్రభుత్వంలో తీసుకునే పలు నిర్ణయాలు, అవలంబిస్తున్న పలు విధానాలను ఆయన ఉదహరిస్తూ మాట్లాడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఇవాళ చర్చలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని రైతులు నమ్మడం లేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అసత్యాగ్రహం’’లో మోదీకి సుదర్ఘ చరిత్ర ఉన్నందుకే రైతులు ఆయనను నమ్మడం లేదని రాహుల్ ఆరోపించారు. ‘‘ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ ఏమైంది..’’ అన్నారు.
నోట్లరద్దు సమయంలో 50 రోజుల సమయం ఇస్తే అన్నీ చక్కబెడతాననీ.. లేకుంటే తనను శిక్షించవచ్చని ప్రధాని ప్రకటించడాన్నీ ఆయన గుర్తుచేశారు. కరోనా మహమ్మారిపైనా ప్రధానినుద్దేశించి రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘21 రోజుల్లో కరోనాపై విజయం సాధిస్తామన్నారు.. కానీ ఏమైంది?’’ అని ఆయన ప్రశ్నిచారు. ‘‘మన దేశంలోకి ఎవరూ చొరబడలేదు. ఏదీ స్వాధీనం చేసుకోలేదు..’’ అంటూ మోదీ ప్రభుత్వం చైనాని ఉద్దేశించి చేసిన ప్రకటనను కూడా రాహుల్ గుర్తుచేశారు. ‘‘ఇలాంటి ‘అసత్యాగ్రహం’లో మోదీకి సుదీర్ఘ చరిత్ర ఉన్నందునే రైతులు ఆయన్ను నమ్మడం లేదన్నారు.