సరిహద్దులో చైనా భారత్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనకు తెలిసిందే. గత ఆరు నెలల నుంచి చైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. భారత్ భూభాగంలోనికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో ఇరు దేశాల అధికారులు ఇప్పటికే పలు మార్లు చర్చలు కూడా జరిపారు. అయినప్పటికీ ఇవి పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. కాగా ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చైనాతో జరుగుతున్న చర్చల్లో సానుకూల ఫలితాలు లేవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లడఖ్లో యథాతథ స్థితి కొనసాగుతోందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సకారాత్మక పరిణామాలేవీ లేవని చెప్పారు. మిలిటరీ లెవెల్ చర్చలు మరొకసారి జరుగుతాయని చెప్పారు. యథాతథ స్థితి కొనసాగుతుండటం సకారాత్మక పరిణామంగా తాను భావించడం లేదన్నారు. యథాతథ స్థితి ఉన్నపుడు దళాల మోహరింపును తగ్గించకపోవడం సహజమేనన్నారు. విస్తరణవాదంతో ఏ దేశమైనా మన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే, ఇతరుల చేతికి మన భూమి వెళ్ళకుండా కాపాడుకునే శక్తి, సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయన్నారు.
ప్రపంచంలోని ఏ దేశం అయినా విస్తరణవాదంతో రగిలిపోతే, దానిని నిరోధించే సత్తా భారత దేశానికి ఉందన్నారు. లడఖ్ సరిహద్దుల్లో సైన్యం మోహరింపును తగ్గించబోమని తెలిపారు. చైనా కూడా తన దళాలను తగ్గించే అవకాశం లేదన్నారు. చర్చలు సత్ఫలితాలిస్తాయని తాము భావిస్తున్నామన్నారు. రేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మన దేశం దేశ భద్రతకు పెద్ద పీట వేస్తోందని చెప్పారు.