కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాను మళ్లీ భయపెడుతోంది. ఇప్టటికే 20 స్ట్రెయిన్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తమైంది. కరోనా స్ట్రెయిన్ను కట్టడి చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్కు విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకూ విధించిన తాత్కాలిక నిషేధాన్ని 2021 జనవరి 7 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటన చేసింది.
యూకే నుంచి దేశానికి తిరిగివచ్చిన వారిలో మంగళవారం ఆరుగురికి కొత్త కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బుధవారం మరో 14 మందికి యూకే స్ట్రెయిన్ సోకినట్లు కేంద్రం తెలిపింది. దీంతో.. భారత్లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 20కి చేరింది. నవంబరు 25- డిసెంబరు 23 మధ్య యూకే నుంచి 33 వేల మంది దేశానికి తిరిగొచ్చారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం వరకు 114 మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించింది. ఈ నెల 9 నుంచి 22వ తేదీల మధ్య భారత్కు చేరిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపనున్నారు.
ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారిలో 20 మందికి స్ట్రెయిన్గా నిర్ధారణ కావడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఈ సమయంలో యూకే నుంచి విమానాలను అనుమతించడం శ్రేయస్కరం కాదని భావించింది. వీరందరినీ ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్లో ఉంచారని, దగ్గరి కాంట్టాకులను క్వారంటైన్ చేశారని కేంద్రం తెలిపింది. సహ ప్రయాణికులు, కుటుంబంలో, కాంటాక్టుల గుర్తింపు కొనసాగుతోందని పేర్కొంది.