తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల బయటకు వస్తున్నారు. కరోనా లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే లోకేష్ మాత్రం ఏపీలో ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్లు పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం కరెక్టు కాదని వైసీపీ నేతలు కొద్ది రోజులుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు బాగానే ప్రభావం చూపినట్లు ఉన్నాయి. అందుకే లోకేష్ ఇప్పుడు ఏపీలోని జిల్లాల్లో పర్యటిస్తూ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. రాయలసీమ, ఆంధ్రాలో ఆయన పర్యటనలు చేశారు. అయితే ఈ పర్యటనల వల్ల ఏం లాభమని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.
వై.ఎస్ జగన్ అన్ని రకాలుగా ప్రజలు, రైతులకు అందుబాటులో ఉన్నా ప్రతిపక్షం ఇలా చేయడం వల్ల ఏం లాభం ఉండదని చర్చించుకుంటున్నారు. ఇక లోకేష్ ఎంతమంది రైతులతో మాట్లాడినా రైతులకు మేలు చేస్తున్న తమ ప్రభుత్వంవైపే ప్రజలు ఉంటారని అంటున్నారు. ఇక టిడిపి నేతలు మాత్రం మరోలా మాట్లాడుకుంటున్నారు. మొన్న నారా లోకేష్ ట్రాక్టర్ నడిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారని నారా లోకేష్పై కేసులు పెట్టారు. దీంతో లోకేష్కు ఎక్కడ క్రేజ్ వస్తుందో అన్న భయంతోనే అధికార పార్టీ ఇలా చేస్తోందని అంటున్నారు.
ఇక లోకేష్ పర్యటనలో మొత్తం అధికార పార్టీపై ఆగ్రహంతోనే మాట్లాడారు. భారీ వర్షాలతో అపారమైన పంట నష్టం జరిగినా..అంచనా వేసి, బాధిత రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. పంట నష్టం నివేదికలు ప్రభుత్వానికి పంపే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ బిడ్డనంటూ ఎన్నికల ముందు పాట రాయించుకుని మరీ జగన్ గద్దెనెక్కారనీ.. భారీ వర్షాలతో సీమ రైతు బిడ్డలు నష్టపోతే పరామర్శించేందుకు తీరిక లేదా అన్నారు. ఇక లోకేష్ పర్యటన జిల్లాల్లోని నేతల్లో జోష్ని నింపిందని అనుకుంటున్నారు.