జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నాడు. బీజేపీ, జనసేన పొత్తును ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏం ఇస్తుందో చెబుతూ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి జనసేన స్టాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యాకానుక పథకాన్ని సీఎం వై.ఎస్ జగన్ ఘనంగా ప్రారంభించారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని ప్రభుత్వం చెబుతోంది. మంత్రులు కూడా దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ పథకంలో కేంద్రం భాగస్వామ్యం ఉందన్న విషయం బయటకు వచ్చింది. అయితే ఆ భాగస్వామ్యంలో కేంద్రానికే అధిక భాగమని కూడా వివరాలు బయటకు వచ్చాయి. ఈ చర్చ జరుగుతున్న తరుణంలో ఏపీ మంత్రులు మాట్లాడుతూ ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వానికే అని అన్నారు.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. జగనన్న విద్యాకానుక పథకం పేరు మోడీ జగనన్న విద్యా కానుక అనడం సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మాత్రమే నిధులు ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత ఖర్చు చేస్తున్నాయో వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ వైపు ప్రభుత్వం ఇది తమ పథకమే అంటున్న తరుణంలో.. పవన్ ఇలా చేయడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ మేధావులు మాత్రం ఇది బీజేపీ, జనసేన ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్న పరిస్థితిలో ఎలా బలపడాలన్నది వీరి ముందున్న లక్ష్యం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఏం చేస్తుంది.. రాష్ట్రం చేస్తున్న దాంట్లో ఏమైనా తేడాలున్నాయా ఇవన్నీ గమనించి వైసీపీని టార్గెట్ చేసేందుకు వీళ్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పవన్ చాకచక్యంగా వివరాలతో సహా జగనన్న విద్యాకానుక పథకానికి సంబంధించి కేంద్రం ఎంత ఇస్తుందో వివరాలు బహిర్గతం చేశారు.