అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే ఓ గంజాయి అక్రమ రవాణాపై దాడులు చేసిన పోలీసులు దొరకిన గంజాయిని తలా ఇంతా అమ్ముకోవడం డిపార్టుమెంట్ను షాక్కు గురిచేసింది.
ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. జహంగీర్పుర్లోని బి బ్లాక్లో ఓ వ్యక్తి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి వ్యాపారం చేస్తుండేవాడు. ఈ సారి కూడా ఆయన ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి నిల్వ చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ దాడులు చేసి 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డుల్లో మాత్రం 920 గ్రాముల గంజాయి మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. కాగా ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేసి అమ్ముతున్న అనిల్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి ఒకటిన్నర లక్షలు తీసుకొని ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై డిప్యూటీ కమీషనర్ దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. మొత్తం స్వాధీనం చేసుకున్న గంజాయి 160 కేజీలు అయితే రికార్డుల్లో చూపించిన 920 గ్రాములు కాకుండా మిగతా గంజాయి మొత్తం అమ్మేశారు. వచ్చిన డబ్బు మొత్తం నలుగురు పోలీసులు పంచుకున్నారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు ఉన్నారు. అనిల్ను విచారిస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.