ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు సర్వీసులకు ప్రయాణీకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కరోనా కారణంగా మొదట్లో అడపాదడపా వస్తున్న ప్రయాణీకులు ఇప్పుడు కొంచెం బాగానే వస్తున్నారు. దీంతో ఆదాయంలో రోజూ కొంత మెరుగైన ఫలితాలే వస్తున్నాయి.
కరోనా కారణంగా మార్చి 22 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ఇలానే ఉంటే పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయని భావించిన ప్రభుత్వం మే 11వ తేదీ నుంచి కొన్ని బస్సులు ప్రారంభించాలని నిర్ణయించడంతో 1700 బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. అయితే అప్పుడు మాత్రం జనాలు బస్ ఎక్కేందుకు భయపడ్డారని చెప్పాలి. దీంతో ఆదాయం కూడా తక్కువగానే ఉండేది.
మామూలుగా అయితే ప్రతి రోజూ 16 కోట్ల వరకు ఆర్టీసీకి రాబడి రావాల్సి ఉంది. అయితే జూన్లో రూ. 2 కోట్లు, జులైలో 1.7 కోట్ల రూపాయలు, ఆగష్టులో రూ .2 కోట్లు ఆదాయం వచ్చింది. కాగా ఈ నెలలో ఇప్పటివరకు రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఆర్టీకి సంతోషం వ్యక్తం చేస్తోంది. గత మూడు నెలలకు ఈ నెలకు ఆదాయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇది క్రమంలో రోజురోజుకూ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా తెలంగాణాకు ఇప్పటివరకు బస్సులు తిప్పడం లేదు. ఇది ఎప్పుడు మొదలవుతుందో చెప్పలే. దీని కారణంగా రోజూ కోటిన్నర కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో 4500 బస్ సర్వీసులు నడుస్తున్నాయి.