ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో జరిగిన యువతి ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా యూపీలో ఇది పెను ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఈ సమయంలో బీజేపీ ఎంపీ ఒకరు ఘటనకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని చెప్పారు.
యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలను బహిరంగంగా కాల్చి చంపాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె యాక్టింగ్ కెరీర్కు ఈమె స్వస్తి పలికారు. బాధితురాలిపై పాశవికానికి ఒడిగట్టిన దుర్మార్గులను ఏమాత్రం ఉపేక్షించరాదన్నారు. ఈ ఘటనను రాజకీయాలతో ముడిపెట్టకూడదన్నారు. దోషులను ప్రజల ముందుకు ఈడ్చుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలన్నారు. నేరగాళ్లపై కనికరం చూపకూడదని ఆమె ఆవేశంగా మాట్లాడారు.
ఘటన జరిగిన తర్వాత యువతి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమె మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీపై సైతం మండిపడ్డారు. మీ కూతుర్లకే ఇలా జరిగితే ఎలా అని ప్రశ్నించారు. కాగా నిన్న రాహుల్ గాంధీ బాదిత యవతి కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ ఘటన దేశ వ్యాప్తంగా మరింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తుందేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.