బీజేపీ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టాలని చూస్తోంది. ఇందుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల బీహార్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ నితీష్ కుమార్ పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది.
వచ్చే ఏడాదిలో దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే తీవ్రంగా శ్రమిస్తోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంపై బీజేపీ ఇప్పుడు గురి పెట్టింది. ఆ రాష్ట్రంలో మమత సర్కార్కు బీజేపీకి ఏమాత్రం సరిపోవడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటించారు. అయితే అమిత్ షా పర్యటనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో అమిత్షా ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
బీజేపీ ఏకంగా 200 సీట్లు సాధిస్తుందంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘నా కామెంట్స్ చూసి నవ్వే వాళ్లను నవ్వుకోనివ్వండి. మనం ప్లాన్ ప్రకారం పనిచేసుకుపోతే..బీజేపీ 200 సీట్ల కంటే ఎక్కువ సాధిస్తుంది’ అంటూ బెంగాల్ పర్యటనలో అమిత్ షా కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ రెండంకెల సంఖ్య(డబల్ డిజిట్) కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే తాను ట్విటర్ను విడిచి పెట్టేస్తానన్నారు. ఈ టార్గెట్ను చేరుకునేందుకు కూడా బీజేపీ అమితంగా కష్టపడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ‘బీజేపీకి మద్దతిస్తున్న మీడియా ఎంతగా హడావుడి చేసినా కూడా బీజేపీ రెండంకెల సంఖ్యకు మించి సీట్లు సాధించలేదన్నది వాస్తవం. ఈ ట్వీట్ను సేవ్ చేసుకోండి. బీజేపీ అధికసీట్లు సాధిస్తే నేను ట్వీటర్ను వదిలేస్తా..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.