పశ్చిమబెంగాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమత సర్కార్తో బీజేపీ పోటీకి సై అంటోంది. బెంగాల్లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
అమిత్ షా మాట్లాడుతూ చొరబాటు దారులను మమతా బెనర్జీ ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘోరంగా ఫెయిలయిందని ఆరోపించారు. టీఎంసీ నియంతృత్వ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. కోవిడ్ టీకా ప్రారంభమైన వెంటనే సీఏఏను పరిశీలిస్తామని అమిత్ షా ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా పౌరసత్వ చట్టానికి సంబంధించిన నిబంధనలు ఇంకా రూపొందించ బడలేదని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 టీకాలు ప్రారంభించిన తర్వాత సీఏఏ పరిశీలనపై ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు.
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడిపై సీఎం మమతా మమతా బెనర్జీని ప్రశ్నించారు. నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించి అన్ని వివరాలనూ సేకరిస్తున్నామని, రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఈఘటనపై తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి బీజేపీకే పరిమితం కాదని.. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బయటి వ్యక్తుల పేరుతో తృణమూల్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతామన్న ధీమాతో ఉంది. అయితే ఇటీవల మమత సర్కార్లోని కీలక నేతలు బీజేపీలో చేరడం బీజేపికి కలిసి వచ్చే అంశమే. మరి బెంగాల్లో ఏం జరుగబోతుందో వేచి చూడాలి.