ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడం మనకు తెలిసిందే. ఏ విషయంలోనైనా ప్రభుత్వానికి గానీ. ప్రభుత్వ అధికారులకు కానీ లేఖలు రాస్తూ ఆయన సంచలనంగా మారారనే చెప్పొచ్చు. ఇటీవల ఆ రాష్ట్ర డీజీపీకి పలుమార్లు ఆయన లేఖలు రాయడం మనకు తెలిసిందే. దీనికి రిప్లై ఇస్తూ డీజీపీ సైతం చంద్రబాబుకు లేఖలు రాశారు.
అయితే ఈ లేఖలపై టిడిపి రాద్దాంతం చేస్తూనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు దారిలో ఇంకో నేత వచ్చారు. ఆయన సీపీఐ నేత రామకృష్ణ. అమరావతి ఉద్యమంలో ఆయన కూడా పాల్గొంటున్నారు. టిడిపితో పాటు ఆయన కూడా అమరావతి రైతుల పక్షాన పోరాడుతున్నారు. రామకృష్ణన పలువురు విమర్శిస్తున్న ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మొన్నటి వరకు అమరావతి విషయంలో రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మధ్య ఆయన కానీ ఆ పార్టీ నేతలు కానీ ఈ రాజీనామాల వ్యాఖ్యలను ప్రస్తావించడం లేదు.
అయితే సీపీఐ రామకృష్ణ ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని చెబుతున్నారు. ఇది విన్న వారంతా అప్పుడు చంద్రబాబు చేసిందే ఇప్పుడు సీపీఐ రామకృష్ణ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. దీంతో పాటు డీజీపీకి కూడా రామకృష్ణ లేఖ రాశారు. అమరావతికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మంగళగిరి ప్రాంతం నుంచి కృష్ణాయపాలెం వస్తున్న దళితుల్ని స్థానిక దళితులు అడ్డుకున్నారని.. కానీ పోలీసులు రాజకీయ కోణంలో ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయమని రామకృష్ణ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం తగదన్నారు. 314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతోందని తెలిపారు. ఈ లేఖ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇది కూడా అచ్చం చంద్రబాబు తరహాలోనే ఉందని అంటున్నారు. అప్పుడు చంద్రబాబు లేఖలు రాస్తే ఇప్పుడు రామకృష్ణ లేఖలు రాస్తున్నారని అనుకుంటున్నారు.