ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింని అంతా అనుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ పూర్థిస్థాయిలో మనుగడ లేకుండా పోయిందన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే టిడిపి నేతలు మాత్రం పార్టీ ఇంకా పటిష్టమవుతోందని చెబుతున్నారు.
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పూర్తిగా డీలా పడిపోయిందని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఇందుకు బలం చేకూర్చుతూ ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి పటిష్టమవుతోందని అన్నారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జీలతో సోమిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వ్యవస్థలు పూర్తిగా పతనమవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సమావేశంలో తిరుపతి ఎన్నికల గురించి చర్చించారు. న్యాయ వ్యవస్థలపై ప్రభుత్వం ఇలా మాట్లాడటం మొట్టమొదటిసారి చూస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థలపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలపై మాట్లాడడం మానుకోవాలని.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు.