ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశంతో పాటు, అభివృద్ధి వ్యవహారాలు, కోర్టుల అంశంపై ఆయన మాట్లాడారు. మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నామని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.
అమరావతి ఉద్యమం గురించి బొత్స మాట్లాడుతూ మూడు రాజధానులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. కాగా నేటితో అమరావతి ఉద్యమం చేపట్టి 300 రోజులైంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 500 ఎకరాలు కుదించామని.. ఆ పరిసర ప్రాంతాల్లో స్పెషల్ ఎకానమీ జోన్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే టీడీపీ పని అన్నారు.
ఇక అమరావతిపై ఉద్యమాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ఎవ్వరూ స్పందించ లేదన్నారు. తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్టులే మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారన్నారు. విశాఖ భూకుంభకోణాలపై త్వరలోనే సిట్ నివేదిక బయటికి వస్తుందన్నారు. ఇక న్యాయవ్యవస్థపై మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్ని విషయాలు పొందుపరిచి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారన్నారు. కోర్టుల పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం వుందన్నారు.