పీటలపై పెళ్లిళ్లు ఆగిపోవడం మనం ఈ మధ్య తరచూ వింటూనే ఉన్నాం. అయితే పీటల మీదకు వెళ్లకముందే ఇప్పుడు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. వధువు, వరుడు బంధువుల మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.
యూపీలోని పీలీభీత్లో ఒక పెళ్లి వేడుకలో మందు బాబులు చిందులు వేయడంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లి కూతురు ఈ పెళ్లి తనకు వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే షాజహాన్పూర్ పరిధిలోని మవియాపూర్ నుంచి మగపెళ్లివారు బిస్లండా వచ్చారు. అయితే వారు వందమందికి పైగా ఉన్నారు. కరోనా కట్టడి నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో మగపెళ్లివారు, ఆడపెళ్లివారి మధ్య వివాదం మొదలైంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న కొంతమంది పెళ్లివారు నానా హంగామా చేసి, పెళ్లికుమార్తె సోదరుడు, చిన్నాన్నలను కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికుమార్తె ఈ పెళ్లికి నిరాకరించింది. దీంతో వివాదం మరింత ముదరడంతో పోలీసుల వరకూ చేరింది. వారు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు.
ఇరుపక్షాలవారినీ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే పెళ్లికుమార్తె ఈ పెళ్ళి వద్దంటూ మొండికేసింది. దీంతో వరుడు పెళ్లి కాకుండానే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఇలాంటిదీ ఇటీవల మరొకటి వెలుగు చూసింది. పెళ్లి భోజనాల పెట్టే వద్ద పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధువులకు గొడవ అవ్వడంతో పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.