కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం రైతులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు. దీంతో రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే దీన్ని బట్టి చూస్తే ఇంకా ఆందోళనలు ఉదృతం అయ్యేట్లు కనిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతుల ఆందోళనలతో ఇప్పటికే ఢిల్లీ శివారులో పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీ వైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా సీనియర్ పోలీసు అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. రైతులు నిర్వహిస్తున్న నిరసనల కారణంగా అల్లర్లు జరిగే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో షా ఈ భేటీ నిర్వహించినట్లు సమాచారం. ఎలాంటి అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షా అధికారులతో చర్చించారు. రైతుల ఆందోళనను పొడగించడం, హింసకు పాల్పడే ఉద్దేశంతో రైతు సమూహంలోకి కొన్ని శక్తులు ప్రవేశించి, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నట్లు ప్రభుత్వానికి కొన్ని నివేదికలు అందాయి.
దాదాపు పది గ్రూపులు రైతుల ఉద్యమంలోకి చొరబడి అల్లర్లు సృష్టించడానికి రెడీ అయిపోయాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వంద మీడియా సమావేశాలు, 700 జిల్లాల్లో 700 రైతు సదస్సులు నిర్వహించాలని, మీడియాలో ఉధృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. 2022 కల్లా రైతులఆదాయం రెట్టింపు చేయాలన్న మోదీ లక్ష్యాల గురించి వారు వివరిస్తారు.