జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ట్విట్టర్ లో సంచలన కామెంట్లు చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా.. ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఉత్తర భారత దేశంలో ఎంత మంది దక్షిణ భారతానికి చెందిన వారిని.. అధికారులుగా నియమిస్తున్నారని ప్రశ్నించాడు.
అమర్ నాథ్.. వారణాసి.. మధుర ఆలయాలకు ఏనాడైనా సౌత్ ఇండియాకు చెందిన అధికారులను.. ఉన్నత పదవుల్లో నియమించారా అని ట్విటర్ వేదికగా అడిగాడు. అక్కడ మన వాళ్లను ఒప్పుకోనపుడు.. ఇక్కడ అక్కడి వాళ్లను ఎందుకు ఒప్పుకోవాలని సీరియస్ అయ్యాడు.
పైగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. టీడీపీ నాయకులు ఈ నిర్ణయాన్ని ఎందుకు సమర్థిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు. దీనిపై.. టీడీపీ నాయకులు, అటు బీజేపీ నాయకులు మారు మాట్లాడ్డం లేదు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని ఎవరూ రిప్లై ఇవ్వడం లేదు.
మరోవైపు.. పవన్ తీరుపై కొందరు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న విషయాన్ని గుర్తుంచుకొని మరీ మాట్లాడాలని.. బీజేపీని కాదని టీడీపీ ఏదీ చేయలేని పరిస్థితుల్లో ఉందని సూచిస్తున్నారు.