కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సినీనటి ఖుష్బూ పార్టీ వీడారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆమెపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ను వీడితే తమకేమీ నష్టం లేదన్నారు. ఇదే సమయంలో బీజేపీకి వచ్చే లాభమేమీ లేదని చెబుతున్నారు.
నేతలు ఆదిపత్య ధోరణులకు పాల్పడుతూ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఖుష్బూ చెప్పారు. ఖుష్బూ కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం రాజకీయాలు వేడెక్కాయి. కాగా వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు కీలకమే. ఈ పరిస్థితుల్లో ఖుష్బూ పార్టీని వీడటం చర్చనీయాంశమైంది.
దేశం మొత్తం మోదీ హవా కొనసాగుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా మోదీకి గట్టి పోటీ ఇస్తూనే ఉంది. అవకాశం దొరికిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ దండయాత్ర చేస్తూనే ఉంది. అయితే నేతలు పార్టీలు వీడటం ఆ పార్టీకి మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆమె సోనియా గాంధీకి లేఖ రాశారు.
2014లో ఆమె కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి ఆమె అధికార ప్రతినిధిగానే కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఆమె ఎంపిగా పోటీ చేయాలని భావించినా ఆమె కోరిన సీటును కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. అయితే తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా నేటికి అది జరగలేదు. దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బీజేపీ నేతలు ఈమెకు ఉన్న ఆదరణను చూసి పార్టీలోకి ఆహ్వానించినట్లు టాక్. మొత్తానికి నేతలను దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ మున్ముందు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో చూడాలి.