బీజేపీ కాంగ్రెస్ మధ్య ఆర్టికల్ 370పై మాటల యుద్ధం నడించింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీంతో బీజేపీ దీనిపై ఫైర్ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఘట్టిగా సమాధానం ఇచ్చింది.
జమ్మూ కశ్మీర్లోని ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలను, వేర్పాటువాద పార్టీలను దేశ వ్యతిరేకులుగా చూడటం మానేయాలని చిదంబరం అన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమైనదని, దీనిని వెంటనే రద్దు చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్ధరించే క్రమంలో కాంగ్రెస్ కూడా వెన్నుదన్నుగా ఉంటుందని చిదంబరం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజల హక్కులను పునరుద్ధరించడానికి జమ్మూలోని ప్రధాన స్రవంతి ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావడాన్ని ఆయన స్వాగతించారు. భారత ప్రజలు కూడా స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు.
దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. చిదంబరం వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సుపరిపాలన గురించి మాట్లాడక, దేశాన్ని విభజించే నీచమైన ట్రిక్స్ చేస్తున్నారని నడ్డా విరుచుకుపడ్డారు. బిహార్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలకు దిగుతోందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ను పొగిడారని.. ఇప్పుడు ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని చిదంబరం డిమాండ్ చేస్తున్నారని ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇరు పార్టీల మాటలు ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.