ఏపీలో పేరొందిన పెద్ద కంపెనీలు ఏర్పాటు అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే వీటితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అమెజానా మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ కేంద్రాలను విశాఖలో నెలకొల్పే విధంగా సమాలోచనలు జరుపుతున్నారు.
విశాఖపట్నంలో అమేజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరి కొద్ది రోజుల్లోనే ఇది జరుగనుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాగైనా వీటిని విశాఖలో ఏర్పాటు చేయించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశాఖలో ఎలాగైనా ఈ సంస్థలు తెస్తే విశాఖ పేరు నిలిచిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద పెద్ద సంస్థలు కూడా విశాఖవైపు చూస్తున్నప్పుడు రాజధానిగా తప్పుబట్టే అవకాశం కూడా ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైజాగ్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తే ఇండియాలో ఆ సంస్థ మొదటి సెంటర్ ఇదే అవ్వనుంది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్కు దేశంలో డేటా సెంటర్ లేదు. ఇదే కనుక జరిగితే రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వస్తాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సేవలు ప్రభుత్వశాఖల్లో అందుతున్నాయి. ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన సాంకేతిక సేవలు కూడా మైక్రోసాఫ్ట్ నుంచే తీసుకుంటామన్న ప్రతిపాదన కూడా ఆ సంస్థ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్ నుంచి సానుకూల స్పందన వస్తోందని తెలుస్తోంది. ఇక అమేజన్కు హైదరాబాద్లో వాణిజ్య కేంద్రం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో అమేజాన్ వెబ్ సర్వీస్ ను ఏర్పాటయ్యేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి సంప్రదింపులు కూడా జరిపారు.
ఈ తరహాలో ప్రభుత్వం ఆలోచిస్తున్నందునే ఆదాని సంస్థ ఏర్పాటుచేసే డేటా కేంద్రానికి 200 ఎకరాలు కేటాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదు.