విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే మూడు సార్లు దీన్ని వాయిదా వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముందే రాకపోకలకు అనుమతులు ఇచ్చేశారు.
విజయవాడలో ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్కు ప్రారంభం ఎప్పుడనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు దీన్ని ప్రారంభించాలని అనుకున్నా ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంది. ఈ నెల 4వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ మాజీ రాష్ట్రపతి ప్రణభ్ముఖర్జీ చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. దీంతో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ నెల 18వ తేదీన ప్రారభించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తారని ఎంపీ కేశినేని నాని తెలిపారు. అయితే నితిన్ గడ్కరీకి కరోనా టెస్టుల్లో పాజిటివ్ రావడంతో ఆయన వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం జరగడం లేదు. దీనిపై ఎంపీ కేశినేని మాట్లాడుతూ కేంద్ర మంత్రికి కరోనా రావడం వల్ల ఫ్లై ఓవర్ ప్రారంభోత్సం వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి ఫ్లై ఓవర్ పై రాకపోకలకు అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు.