న్యాయాన్ని పరిరక్షించాల్సిన వారే పక్షపాత ధోరణితో తీర్పులు ఇస్తే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో అర్థంకాని పరిస్థితి ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఒక్క ఇంచు కూడా ముందుకు కదలనివ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఏం చేయాలని జీవో ఇష్యూ చేసినా స్టే వస్తుందన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం చేయాలన్నా స్టే వస్తుందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా స్టే వస్తుందన్నారు. ప్రభుత్వం చేసేది ప్రతి ఒక్కటీ చట్ట విరుద్ధంగానే కనిపిస్తుందా అన్నారు. అయితే మా ప్రభుత్వానికి ముందు ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం చట్ట విరుద్ధమైన పనులు చేసినా అది చట్ట విరుద్ధంగా కనిపించని రీతిలో న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని ఆయన అన్నారు.
న్యాయవ్యవస్థ తప్పుదారి పడుతుందన్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రజలే దీని విషయంలో తీర్పు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2011లో తమ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిన సమయంలో ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఒక్కటే న్యాయసూత్రం అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు.
ఏపీలో ఈ విషయాలు మర్చిపోయి న్యాయవ్యవస్థ ఎందుకు పక్షపాత థోరణితో వ్యవహరిస్తూ ఉందని, దీనికి కారణాలేంటో ప్రజలు అర్థంచేసుకోవాలన్నారు. ఏపీలో ఒకటిన్నర సంవత్సర కాలంలో జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఇంచుమించు ప్రభుత్వం న్యాయవ్యవస్థ చేతుల్లో ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుందన్నారు.