విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. టిడిపి, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దం ప్రారంభించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ తీసుకొచ్చింది తానేనని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇక ఈ విషయంపై కేశినేని నాని మాట్లాడటం సిగ్గుచేటని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ సెప్టెంబర్ 4 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేత ప్రారంభింపజేసేది తానేనన్నారు. కొంత మంది నేతలు దుర్గగుడి ఫ్లై ఓవర్ అసాధ్యమన్నారని.. అయితే తాను సాధ్యం చేసి చూపించానన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే అన్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ విజయవాడకు ఒక మణిహారంగా నిలుస్తుందన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుపై హడావుడి చేస్తున్నారన్నారు. అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించిన వారు.. ఇప్పుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారో చెప్పాలన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తానని చేయలేదని మండిపడ్డారు. ప్రజలంతా వైసీపీ సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారన్నారు.