ఏపీలో గోదావరి శాంతించినా వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో చాలా గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మరోవైపు అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. సీఎం జగన్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గోదావరి వరద ప్రవాహానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికీ దేవీపట్నం, చింతూరు, కూనవరం, వీ.ఆర్ పురం, వేటపాక మండలాల్లోని గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి కోనసీమలోని లంకలు, ఏటిగట్టు గ్రామాల ప్రజలు కూడా ఇంకా ఈ వరద ముంపు నంచి బయటపడలేదు. రోడ్లు ఇళ్లు అన్నీ నీటిలోనే ఉన్నాయి.
భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గినా వరద నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. వరద పోలవరం కాఫర్ డ్యాంగా మీదుగా అఖండ గోదావరిలోకి చేరుతోంది. ఇక ప్రభుత్వం వరద సహాయక చర్యలను వేగవంతం చేసింది. సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసిన అనంతరం సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వరద ప్రవాహిత ప్రాంతాల్లో 25కేజీల బియ్యంతో పాటు ఆరు రకాల సరుకులు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో వారం రోజులకు పైగా సరకులు సరఫరా చేయాలని పేర్కొంది.
పద్నాలుగేళ్ల తర్వాత గోదావరికి అత్యధిక స్థాయిలో వదర రావడంతో సీఎం జగన్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం స్వయంగా ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపడంతో బాధితులకు భరోసా ఇచ్చినట్లైంది. వరద కారణంగా దెబ్బతిన్న పరిస్థితులను చక్కదిద్దడం కోసం పది రోజుల టైం విధించారు. ప్రజలు కోలుకునేలా తక్షణం ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో అధికారులు పరుగులు పెడుతున్నారు