శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవిత కథ ఆధారంగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘800’ అనే టైటిల్ను ప్రకటించిన ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్ర మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేసిన విషయం తెలిసందే. అయితే అంతలోనే ఈ సినిమాపై తీవ్ర వివాదం మొదలైంది. ‘శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తోంది. జాతి ఆధారంగా వివక్షను పాటించే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరపై చూపిస్తారా? అందులో నీవు నటిస్తావా.. అంటూ ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే యాష్ ట్యాగ్తో కొంతమంది నెటిజన్లు పోస్ట్ లు చేశారు. ఈ విషయమై ఒకానొక సమయంలో క్రికెటర్ మురళీ ధరన్ కూడా స్పందించారు. అయినా వ్యతిరేకత మాత్రం తగ్గలేదు.
ఈ నేపథ్యంలో వివాదం ఎంతకీ సద్దుమనగకపోవడంతో ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని విజయ్ సేతుపతి ప్రకటించాడు. మురళీ ధరన్ కూడా తనపై సినిమా తీయవద్దంటూ ఓ లేఖను విడుదల చేశాడు. ఈ లేఖలో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనపై సినిమా తీయకపోవడమే ఉత్తమమని మురళీ ధరన్ పేర్కొన్నాడు. దీనికి విజయ్ స్పందిస్తూ.. తాను సినిమా నుంచి తప్పుకుంటున్నాని పేర్కొన్నాడు. మరి ఈ చిత్ర దర్శకనిర్మాతలు వివాదాన్ని ఎదుర్కొని సినిమాను తెరకెక్కిస్తారా? లేదా తమిళుల వాదనతో ఏకీభవించి ఈ బయోపిక్ను మధ్యలోనే ఆపేస్తారా? చూడాలి.