అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా విజయ్ కి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించి పెట్టింది. విజయ్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తాజాగా తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ మూవీని బాలీవుడ్ లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో నేరుగా ఓ సినిమాలో నటించనున్నాడనే వార్త ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. బాలీవుడ్ లో ‘కాయ్ పో చే’, ‘కేదార్నాథ్’ తదితర హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ సినిమాతో విజయ్ హిందీ చిత్రసీమకు పరిచయం కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథపై జరుగుతున్న ప్రచారం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. గత ఏడాది భారత్–పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజులు బంధీగా ఉంచి, పాక్ ప్రభుత్వం అభినందన్ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. విజయ్ దేవరకొండ నటించనున్న తాజా చిత్రాన్ని అభినందన్ జీవిత కథ ఆధారంగా అభిషేక్ కపూర్ రూపొందించనున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.