ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 34 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వరుస సినిమాలకు సైన్ చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్3 సినిమాలకు ఓకే చెప్పిన ఈ హీరో తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకీ ఓ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం.
ఇక ఈ సినిమాలో వెంకీ లెక్చరర్గా కనిపించనున్నాడని తెలుస్తోంది. గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సుందరాకాండలో మాస్టారుగా ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడు మళ్లీ అదే పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమా కథ మాత్రం గుర్రపు పందేల నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను సురేశ్బాబు నిర్మించనున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.