కీలక సమయాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరు స్పూర్తిదాయకమని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉపరాష్ట్రపతి పదవికే ఆయన వన్నెతెచ్చారన్నారు. వెంకయ్యనాయుడు మాటల్లోనే కళాత్మకత ఉంటుందన్నారు.
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ మూడు సంవత్సరాలలో ఎదురైన ప్రధాన ఘట్టాలను క్రోడీకరించి కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ ఓ పుస్తకాన్ని తయారుచేశారు. దీన్ని రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తన పదవీ కాలంలో కీలక బిల్లులైన ట్రిపుల్ తలాక్ , ఆర్టికల్ 370 రద్దు, పౌర సవరణ చట్టం ఆమోదం పొందాయన్నారు. గత మూడేళ్లలో రాజ్యసభ చాలా మారిందని, సభ పనిచేసే సమయం పెరిగిందన్నారు. తాను మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.