నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెర తీశాడు. గతేడాది హైదరాబాద్ ఔటర్ రింగ్ పరిసరాల్లో ఓ యువతిపై నలుగురు అత్యాచారం చేసి కాల్చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే రాంగోపాల్ వర్మ.. దిశ సంఘటనను కూడా సినిమాగా తెరకెక్కించనున్నానని గతంలోనే ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఏకంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి సంచలనానికి తెరలేపాడు. పోస్టర్ లో స్కూటీ, లారీ, పరిగెడుతున్న ఓ వ్యక్తి, అతని కాల్చడానికి గురిపెట్టిన తుపాకీలను చూపించి వర్మ సినిమా కథను చెప్పకనే చెప్పాడు.
ఇక ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 24 న విడుదల చేయనున్న వర్మ… చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. దిశ సంఘటన జరిగింది కూడా నవంబర్ 26న కావడం గమనార్హం. అత్యాచారం, ఎన్ కౌంటర్ వంటి సున్నిత అంశాలున్న ఈ కథను వర్మ ఎలా తెరకెక్కించనున్నాడో చూడాలి.
ఈ సినిమాను అనురాగ్ కంచర్ల నిర్మిస్తుండగా వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.