కరోనా పుణ్యమాని టాలీవుడ్ ఇండస్ట్రీ కళ తప్పింది. ఒకప్పుడు ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల పేరుతో ఎప్పుడూ సందడిగా ఉండే వాతావరణం ఇప్పుడు మూగబోయింది. థియేటర్లు ఓపెన్ లేని కారణంగా కొన్ని సినిమాలు ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో విడుదలయ్యాయి. అయితే ఇవేవీ ప్రీ రిలీజ్ లాంటి వేడుకలను నిర్వహించలేవు. కానీ తాజాగా నాని హీరోగా నటిస్తున్న ‘వీ ‘ చిత్ర యూనిట్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.
కరోనా సమయం కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్ లైన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారట. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ ఈ వివరాలు ప్రకటిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘సెప్టెంబర్ 4న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుద్దాం.. మమ్మల్ని కలవడానికి, ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జాయిన్ అవడానికి మీకు అవకాశం ఉంది” అని పేర్కొంది. నటీనటులు దర్శకనిర్మాతలు ఈ ఈవెంట్ లో పాల్గొంటరని.. సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు మీ స్క్రీన్ వేదికపై కలుద్దామని పోస్టర్ షేర్ చేసింది. ఆన్ లైన్ ఫ్రీ రిలీజ్ వేడుకలకు ప్లాన్ చేస్తున్న ‘వీ’ టీం మరో కొత్త సంప్రదాయానికి తెరతీస్తోంది.