మనసు మమత, మౌనరాగం సీరియల్స్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి శ్రావణి కొండపల్లి తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని మరణించింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మధురానగర్లోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి… లోపల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.
ఇక శ్రావణి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఇలా తెలుస్తున్నాయి… గతంలో దేవరాజురెడ్డి అనే యువకుడు టిక్ టాక్ ద్వారా శ్రావణికి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అతడి నిజస్వరూపం తెలిసి శ్రావణి దూరం పెట్టింది. డబ్బులు ఇవ్వాలని లేకపోతే వ్యక్తిగత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని దేవరాజ్ వేధించేవాడని శ్రావణి కుటుంబ సభ్యులు తెలిపారు. రూ.లక్ష ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని దేవరాజు ఒప్పుకోవడంతో విడతల వారీగా శ్రావణి నగదు పంపింది. డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆపకపోవడంతో శ్రావణి జూన్ 22న ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. ఇక దేవరాజు రెడ్డి వేధింపులు ఎంతకీ తగ్గకపోవడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.