‘అఖిల్‘ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నట వారసుడు అఖిల్. అయితే ఇప్పటి వరకు నాలుగు చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరో ఆశించిన స్థాయిలో మాత్రం ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు.
దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్… దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే.. అఖిల్ మరో సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపిన అఖిల్ తాజాగా ఒక సినిమాకు ఓకే చేశాడు.
అఖిల్ తన తరువాత చిత్రాన్ని సురేందర్ రెడ్డితో చేయనున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
‘ సైరా నరసింహారెడ్డి‘ వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అనీల్ సుంకరతో కలిసి ‘సురేందర్2′ సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.