అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా విషయంలో మరోసారి తనదైన శైలిలో స్పందించారు. గతంలో కరోనాను తేలికచేస్తూ మాట్లాడిన ట్రంప్ అందరితో విమర్శలపాలయ్యాడు. తాజాగా కరోనా సోకడం నాకు వరం అంటూ మరోసారి సంలచన కామెంట్స్ చేశాడు.
ఇటీవల ట్రంప్తో పాటు ఆయన భార్య కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన హాస్పిటల్లో చేరి మళ్లీ శ్వేతసౌధంకు చేరుకున్నారు. ట్రంప్ కరోనా తగ్గకపోయనా ఇంటికి వెళ్లడంపై పలువురు బహిరంగంగానే మండిపడ్డారు. తాజాగా ఆయన కరోనాపై మాట్లాడుతూ కరోనా సోకడం నాకు దేవుడిచ్చిన వరం అన్నారు. ఎందుకంటే ఇది రావడం వల్ల రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ మందులు ఎంత బాగా పనిచేస్తాయో తనకు తెలిసిందన్నారు.
కరోనా మహమ్మారికి అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికే రెండు లక్షల పదివేలకుపైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరోసారి ట్రంప్ చైనాపై మండిపడ్డారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా తనకు వైద్యం అందజేసిన వైద్యులపై ఆయన ప్రశంసలు కురిపించారు. అమెరికాలో ప్రతి ఒక్కరికీ ఇదే స్థాయిలో వైద్యం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.