సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా ఇటీవల బయోపిక్లు ఎక్కువగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఇప్పుడంతా బయోపిక్ల హవా నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు మన దేశంలో పేరు సంపాదించుకున్న వ్యక్తుల బయోపిక్లను తెరకెక్కించారు. కానీ తొలిసారి ఒక విదేశీ వ్యక్తి జీవిత కథ ఇండియన్ స్క్రీన్పై మెరవనుందని. అతనే శ్రీలంక స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. తనదైన స్పిన్ బౌలింగ్తో దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మురళీ ధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఛాన్నళ్ల క్రితమే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మురళీధరన్ టెస్ట్ క్రికెట్ ఫార్మట్లో 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు సృష్టించినదానికి గుర్తుగా ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ నటి రజిశ విజయన్ నటించనుంది. శ్రీపతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ బయోపిక్ కోసం స్వయంగా మురళీధరన్ విజయ్ సేతుపతికి తన స్పిన్ బౌలింగ్ మెళుకువలను నేర్పించడం విశేషం.