అల వైకుంఠపురమంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ పాటికే ఈసినిమా పట్టాలెక్కాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇంకో ఆరు నెలల వరకూ ఫ్రీ అయ్యే అవకాశాలు లేవు.. దీంతో ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ అయ్యే గ్యాప్లో త్రివిక్రమ్ మరో సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఎనర్జిట్ హీరో రామ్తో కలిసి త్రివిక్రమ్ ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ కోసం ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసినట్లు.. ఆ కథను కూడా రామ్కు వినిపించాడని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రామ్ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న ‘రెడ్’ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవుతాడని సమాచారం.