రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్లో తమ వాదనలు వినిపించారు. ఇంకా జల జగడానికి ఫుల్ స్టాప్ పడనేలేదు. ఇప్పటికే పలు మార్లు ఈ వివాదంపై అధికారులు, మంత్రులు సమావేశమై చర్చించినప్పటికీ కొలిక్కిరాలేదు.
తాజాగా బీజేపీ నేత ఎంపీ టీజీ వెంకటేష్ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా కృష్ణా మిగులు జలాలు రాయలసీమ తీసుకుంటే తప్పేంటని టి.జి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారాలంటే ఏపీ సీఎం జగన్ పిలిచి కేసీఆర్కు దావత్ ఇవ్వాలన్నారు. అప్పుడైనా కేసీఆర్ మనసు మారుతుందేమో అని టిజి అన్నారు. అయితే తెలంగాణా మిగులు జలాలు వాడుకోవచ్చు కానీ రాయలసీమ వాడుకోకూడదా అన్నారు. ఈ జలాల అంశం అంత ఈజీగా తేలేది కాదని సాగునీటి నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కేంద్రంలోని బీజేపీకి, ఏపీ ప్రభుత్వానికి మంచి పరిస్థితులే ఉన్నాయని టిజి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులకు జగన్ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. అయితే కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరిస్తుందని తెలిపారు. అయినప్పటికీ కొందరు నేతలు నోరు జారుతున్నారన్నారు. ఇక ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా జరిగే అంశం కాదని.. కేంద్రం నుంచి ప్యాకేజీ తీసుకొని రాయలసీమ, ఉత్తరాంద్రను అభివృద్ధి చేయాలని టిజి అన్నారు.