ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు గురించే టాపిక్ నడుస్తోంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కొర్రీలు పెడుతోందని ఇటీవల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రంతో మాట్లాడతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే తాము నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. పునరావాసం, పరహార ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సమాచారం హక్కు చట్టం కింద దాఖలైన ఓ అర్జీకి కేంద్రం సమాధానం చెప్పింది. 2015 నుంచి రూ. 8614 కోట్లు ఖర్చయినట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 950 కోట్లు, నాబార్డు ద్వారా రూ. 7664.16 కోట్లు మంజూరైనట్లు తెలిపింది. ఇంకా రూ. 2234.77 కోట్లు పెండింగ్లో ఉందని స్పష్టం చేసింది.
అయితే ఈ విషయంలో వైసీపీ మాట్లాడుతూ 2014లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరినా.. పెరిగిన అంచనాతో నిధులు చెల్లంచలేమని 2017లో కేంద్రం తెలిపిందని అంటోంది. అయితే అప్పట్లో కేంద్రంలో ఇద్దరు మంత్రులు టిడిపికి చెందిన వారు ఉన్నా ఎందుకు ప్రశ్నించలేదని అంటోంది. ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ రోజు కేంద్రం కొర్రీలు వేస్తోందని వైసీపీ చెబుతోంది. దీనిపై సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడతారని అంటున్నారు.
మరి ఈ పోలవరం విషయం ఎంత వరకు వెళ్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు నిధుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబధాల విషయంలో ఏమైనా ఇబ్బందులు తెస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలా ముందుకు వెళతారన్ని చూడాలి.