ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పంట పొలాల్లోకి నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో టిడిపి నేత నారా లోకేష్ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.
ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద లోకేష్ ట్రాక్టర్ నడిపగా ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ నడుపుతుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమయ్యారు. ట్రాక్టర్ను అదుపు చేశారు. అయితే లోకేష్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం లోకేష్ను ట్రాక్టర్ నుంచి కిందకు దించేశారు. లోకేష్ పర్యటనలో రైతులను పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వరద ప్రాంతాల్లో తిరుగుతుంటే మమ్మల్ని తిరగకుండా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. వాళ్లు తిరిగితే తామెందుకు ఇలా తిరగాల్సి వస్తోందని చెప్పారు. కొల్లేరుకు ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని… వారిని ఆదుకునే చర్యలు లేవని విమర్శించారు. తాము వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్నామని ఆగమేఘాల మీద ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని అవి కూడా అరకొరగానే ఉన్నాయని లోకేష్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో లోకేష్ పర్యటించి రైతులను పరామర్శించారు. కాగా లోకేష్ పర్యటనలపై వైసీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.