బీజేపీ శివసేన అంటే ఎవ్వరికైనా గుర్తొచ్చేది మంచి మిత్ర పార్టీలని. కానీ ఇప్పుడు ఆ మిత్ర బంధం చెడి మాటల యుద్దం సాగుతోంది. దసరా సందర్భంగా శివసేన ఆదివారం దాదర్ ప్రాంతంలోని సావర్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే మాట్లాడారు. ఆ తర్వాత బీజేపీ కామెంట్స్ చేయడం ప్రారంభించింది.
బీజేపీ అధికార ప్రతినిథి కేశవ్ మాట్లాడుతూ శివసేన అధికారం కోసం హిందుత్వంతో రాజీ పడుతోందని చెప్పారు. సావర్కర్ను కాంగ్రెస్ విమర్శించినప్పటికీ, ఉద్ధవ్ థాకరే కనీసం ఒక మాట అయినా మాట్లాడటం లేదన్నారు. ఇప్పుడు సావర్కర్ ఆడిటోరియంలోనే దసరా సభ జరుపుకోవలసిన పరిస్థితి థాకరేకు వచ్చిందని ఎద్దేవా చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్ విషయంలో పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నాయి. దీనిపై ఇప్పుడు శివసేన మాటల దాడి ప్రారంభించింది.
సావర్కర్కు ఇప్పటికీ భారత రత్న ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీని నిలదీసింది. శివసేన ప్రధాన అధికార ప్రతినిథి సంజయ్ రౌత్ సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ, మహోన్నత హిందుత్వ నేత వినాయక్ దామోదర్ సావర్కర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఇవ్వాలని పునరుద్ఘాటించారు. సావర్కర్ విషయంలో తాము మౌనంగా లేమని, ఇకపై ఉండబోమని స్పష్టం చేశారు. శివసేనకు, హిందుత్వకు సావర్కర్ మార్గదర్శకుడని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అగాడీగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి శివసేన, బీజేపీ మధ్య దూరం బాగా పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇవి సహజమేనని.. అవసరమైతే మళ్లీ అంతా ఒక్కటవుతారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.