డిజిటలైజేషన్లో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేస్తోంది. కేవలం వేలిముద్రతోనే మనీ ట్రాన్సక్షన్స్ చేసుకోనే విధంగా సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వేలిముద్రతోనే ఇకపై నగదు లావాదేవీలు జరగనున్నాయి. దేశం డిజిటలైజేషన్ బాట పడుతుండటంతో లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరిపేందుకు పలు యాప్లు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో యాప్ అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. కేవలం వేలిముద్రతోనే పేమెంట్స్ చేసేలా సరికొత్త ఆండ్రాయిడ్ యాప్.. ఆధార్ పే అందుబాటులోకి రానుంది.
ఆధార్ పేగా పిలిచే ఈ యాప్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఈ నెల14న ప్రధాని మోడీ పారంభించనున్నారు. దీనికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకోవాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. గత ఏడాది డిసెంబరు 30న ప్రధాని ప్రారంభించిన భీం యాప్కి.. ఆధార్ పేకు కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ కొత్త యాప్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు.
ఆధార్పే యాప్ లో వేలి ముద్రే పాస్వర్డ్గా ఉంటుంది కాబట్టి పాస్వర్డ్లను మర్చిపోతామనే టెన్షన్ కూడా ఉండదు. కేవలం వేలిముద్రను స్కాన్ చేసి బయోమెట్రిక్ సమయంలో ఇచ్చిన వేలిముద్రతో పోల్చి చూస్తోంది కాబట్టి.. అది మ్యాచ్ అయితేనే ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతాయి. అయితే ఈ విధానం ద్వారా చెల్లింపులు జరపడానికి ఆధార్ నంబర్ను బ్యాంక్ అకౌంట్తో అనుసంధానించుకోవడం తప్పనిసరి.